తండేల్ అంటే ఏంటి? ఏపీ మత్స్యకారులు పాకిస్తాన్కు ఎలా చిక్కారు?
Fri Feb 07, 2025 09:00 Cinemas
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ సినిమా రేపు విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఏపీలోని మత్స్యకారులకు సంబంధించిన రియల్ స్టోరీని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించారు. ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు.. సముద్రంలో అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి.. అక్కడే పాక్ అధికారుల చేతుల్లోకి చిక్కుకుపోయారు. అనంతరం వారిని కరాచీ జైలుకు తరలించి.. ఏడాదికి పైగా అక్కడే నిర్భందించారు. దీంతో కుటుంబ సభ్యులు.. ఏపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. తమ వారిని విడిపించాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పటి విదేశాంగ శాఖ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్.. పాక్ అధికారులతో కలిసి చర్చలు జరిపారు. అమాయకులైన జాలర్లను విడిపించాలని కోరగా.. అందుకు అంగీకరించిన పాక్.. వాఘా సరిహద్దుల్లో మత్స్యకారులను భారత్కు అప్పగించింది. దీంతో వారిని కుటుంబ సభ్యులకు కేంద్రం అప్పగించింది. ఆ 22 మందిలో ఒక వ్యక్తి నిజ జీవితం ఆధారంగా ఈ తండేల్ సినిమాను రూపొందించారు. తండేల్ సినిమా విడుదల సందర్భంగా.. అసలు ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
ఏపీ మత్స్యకారులు గుజరాత్ ఎందుకు వెళ్లారు?
సాధారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు పొట్టకూటి కోసం గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్తూ ఉంటారు. శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల, విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాలు.. సముద్రానికి పక్కనే ఉన్నా.. ఆ ప్రాంతంలో మత్స్య సంపద చాలా తక్కువగా ఉంటుంది. దీనికి తోడు అక్కడ మత్స్యకారుల మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో రోజంతా సముద్రంలో వేటకు వెళ్లినా సరిపడా ఆదాయం లభించని పరిస్థితి ఉంటుంది. దీంతో ప్రతీ సంవత్సరం సీజన్లో వందలాది మంది మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ తీర ప్రాంతం అయిన వీరావల్కు వలస వెళ్తూ ఉంటారు. జులై-ఆగస్టు మధ్య అక్కడికి వెళ్లి.. తిరిగి ఆ తర్వాతి ఏడాది ఫిబ్రవరి-మార్చి వరకు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి వెళ్లిన కొందరు జాలర్లు.. గుజరాత్లోని ఓ చేపల వ్యాపారి వద్ద పని చేస్తుండగా.. 2018 నవంబర్ 31వ తేదీన అరేబియా సముద్రంలో వేటకు వెళ్లారు. గుజరాత్ తీరం నుంచి పాకిస్తాన్ జలాల వైపు వెళ్లి.. అక్కడి భద్రత దళాలకు చిక్కారు. మొత్తం 4 పడవల్లో మత్స్యకారులు వేటకు వెళ్లగా అందులో 3 బోట్లు పాకిస్తాన్ కోస్ట్గార్డ్లకు పట్టుబడ్డాయి. అందులో 22 మంది మత్స్యకారులు ఉన్నారు. దీంతో దూరం నుంచి ఆ విషయాన్ని గమనించిన మిగిలిన బోటు.. వెంటనే వెనక్కి వచ్చి వివరాలను ఇక్కడి అధికారులకు వెల్లడించారు. కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయాన్ని చెప్పడంతో వారు రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీ ఎంపీలకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మరోవైపు.. పట్టుబడిన జాలర్లను కరాచీకి తరలించారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మత్స్యకారులు పాక్ అధికారులకు పట్టుబడిన విషయాన్ని.. ఏపీ అధికారులు భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో వారు ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీలు, అప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్.. ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపారు. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ సాయంతో ఏపీ జాలర్లను విడిపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు.
ఆ తర్వాత ఏడాదికి పైగా పాకిస్తాన్ చెరలోనే ఆ 22 మంది ఆంధ్రప్రదేశ్ జాలర్లు మగ్గిపోయారు. వారిని విడిపించేందుకు భారత్, పాక్ మధ్య అనేక చర్చలు జరిగాయి. చివరికి భారత ప్రభుత్వం చేసిన కృషికి వారంతా 2020 జనవరి 6వ తేదీన సురక్షితంగా భారత్కు చేరుకున్నారు. భారత్-పాక్ మధ్య ఉన్న వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్ రేంజర్లు.. 22 మంది ఏపీ మత్స్యకారులను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు అప్పగించారు. ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ.. వాఘా సరిహద్దు వద్దకు చేరుకుని మత్స్యకారులకు స్వాగతం పలికారు. ఆ తర్వాత వారిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడంతో ఈ కథ సుఖాంతం అయింది.
అయితే అప్పుడు ఏపీ జాలర్లు పాక్ నిర్భంధంలోకి వెళ్లడం.. ఆ తర్వాత విడుదల కావడం.. అసలు ఒక మత్స్యకారుడి జీవన విధానం ఎలా ఉంటుంది అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఈ తండేల్ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకి తండేల్ అని ఎందుకు పేరు పెట్టారు. అసలు తండేల్ అంటే ఏంటి అని చాలా మందికి అనుమానం వస్తోంది. అయితే తండేల్ అంటే కెప్టెన్ ఆఫ్ ది బోట్ అని పేర్కొంటున్నారు. ఈ తండేల్ అనే పదాన్ని మత్స్యకారులు ఉపయోగిస్తారు. సాధారణంగా సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లేటప్పుడు.. ఒక్కో పడవలో 10 నుంచి 20 మంది వరకు జాలర్లు ఉంటారు. అందులోని ఒక వ్యక్తి వారందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక లీడర్లా ఉంటాడు. ఆ లీడర్నే తండేల్ అని పిలుస్తారు. అయితే ఈ సినిమాలో నాగచైతన్య తండేల్గా కనిపించనున్నట్లు తండేల్ మూవీ టీమ్ చెబుతోంది.
మరోవైపు.. ఈ తండేల్ సినిమా కోసం హీరో నాగచైతన్య చాలా కష్టపడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మత్స్యకారుడి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ తండేల్.. నాగచైతన్యకు 23వ సినిమా. ఇక ఈ సినిమా కోసం.. మత్స్యకారుల పరిస్థితులను, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి.. షూటింగ్ సమయంలో నాగచైతన్య సహా ఈ తండేల్ మూవీ టీమ్ మొత్తం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. మరి ఏపీ జాలర్ల రియల్ స్టోరీ సక్సెస్ కాగా.. ఈ తండేల్ సినిమా టాక్ ఏం తెచ్చుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!
విలన్ గా మారుతున్న బ్రహ్మానందం.. థియేటర్ అంతా షేక్ అవుద్ది అంటూ.. వ్యాఖ్యలు వైరల్!
జగన్ దొంగ రాజకీయం.. ఆ డబ్బును లెక్కపెట్టడానికి.. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది!
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు! ఎక్కడో తెలుసా?
జగన్ 2.0 కాదు, పాయింట్ 5 మాత్రమే! మాజీ మంత్రి తీవ్ర విమర్శలు! ఇలాంటి పరిస్థితుల్లో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Cinemas #Thandel #India #Pakisthan
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.